పరిగి: ‘జగనన్నను విమర్శించే స్థాయిగానీ, కనీస అర్హత గానీ నీకెక్కడుంది మంత్రి సవితా’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.ఆదివారం మండలంలోని మోదా పంచాయతీ చెర్లోపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సొంత తల్లి చేత కేసులు పెట్టించుకున్న సవిత హీనమైన చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు సంస్కారం ఉంది కాబట్టే సవిత చరిత్ర గురించి మాట్లాడడం లేదన్నారు. బీసీలకు ఏం న్యాయం చేశావని ఆ శాఖ మంత్రిగా ఉంటున్నావో చెప్పాలని నిలదీశారు. గుడికట్లకు పింఛన్, 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత క్షేమంగా ఉంటావని హితవు పలికారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేర్పిన క్రమశిక్షణ, విలువలతో రాజకీయం చేస్తున్నామని, హద్దు దాటితే సవిత కంటే బాగా మాట్లాడగలమని హెచ్చరించారు.
ఆ పత్రికపై అక్కసు చూపించు
పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్ అంశాల్లో చిట్టచివరి స్థానంలో ఉన్నారని రాసిన ఈనాడు పత్రికను వదిలేసి నిజాలను నిర్భయంగా రాసే సాక్షిపై చిందులేస్తావా అంటూ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ జగన్ను విమర్శిస్తావా? ప్రజల దృష్టిలో నీవే పెద్ద సైకో. పెనుకొండ మెడికల్ కాలేజ్ను చూసి కళ్లు బైర్లు కమ్మి నేలను చూపించి అసలు కాలేజే లేదని చెిప్పి పెద్ద జోకరయ్యావు.హాఫ్ నాలెడ్జ్ మంత్రిగా పేరొందావు. ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలను ప్రోత్సహిస్తూ సొమ్ముచేసుకుంటున్న నీవు జగన్మోహన్రెడ్డిపై మాట్లాడితే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అవినీతి అక్రమాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో చరణ్రెడ్డి, మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ కుటుంబంపై
నిందారోపణలు చేస్తే ఖబడ్దార్
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజం
సాక్షి పత్రికపై చిందులేస్తే
సహించబోమని స్పష్టీకరణ


