ధర్మవరం: దొడ్దిదారిన గెలిచేందుకు ఎంతకై నా దిగజారి కుట్రలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నార్పల సత్యనారాయణరెడ్డి, జిల్లా డిజిటల్ కో ఆర్డినేటర్ మారుతీరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పది నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి బీఎల్వోలతో సమన్వయం చేసుకుని ఆధారాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తే వెంటనే తెలియజేయాలన్నారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ నుంచి చాలామంది వలస వెళ్లి ఉంటారని, వారికి సంబంధించి ఆధారాలు సమర్పించి ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్రమత్తంగా లేని కారణంగా లక్షలాది ఓట్లు తొలగించారని, ఫలితంగా అధికారం తలకిందులైన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఎల్ఏలు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
దొడ్డిదారిన గెలిచేందుకు
చంద్రబాబు ఎంతకై నా దిగజారతారు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ ‘వజ్ర’


