రొళ్ల: స్థానిక మారుతీ కాలనీలో నివాసముంటున్న రైతు దాసేగౌడు పాడి ఆవు శనివారం ఐదు కాళ్లు కలిగిన దూడను ప్రసవించింది. ముందు రెండు కాళ్లు, వెనక మూడు కాళ్లు ఉండడం గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి పుట్టుకలు ఉంటాయని పశువైద్యాధికారి పేర్కొన్నారు. శస్త్రచికిత్స ద్వారా అదనపు కాలిని తొలగించే అవకాశముందని, ఇందు కోసం మడకశిరలోని ప్రశువైద్యాధికారులను సంప్రదించాలని రైతుకు సూచించారు.
పీఆర్సీని నియమించాలి : ఆపస్
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) ఆధ్వర్యంలో శనివారం బుక్కపట్నంలో జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ.. పీఆర్సీ నియామకం చేయాలని, ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు పరీక్షల్లో తెలుగులో సమాధానాలను రాసినా మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులలో నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అమరా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సురేష్బాబు, మహిళా ప్రముఖ్ ప్రసన్న లక్ష్మి, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కేబుల్ అపహరణ
కదిరి అర్బన్: మండలంలోని వీరేపల్లిపేటలో రైతుల వ్యవసాయ మోటార్లకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ ప్రాంతంలో ప్రవహిస్తున్న మద్దిలేరులో 16 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్ల విద్యుత్ కేబుల్ అపహరణకు గురైనట్లు బాధితులు శనివారం కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.1 లక్షకు పైబడి ఉంటుందని పేర్కొన్నారు.


