ఉరుములు, మెరుపులతో కూడిన గాలీవానకు ఎన్పీకుంట మండలం మరికొమ్మదిన్నె గ్రామానికి చెందిన కేవీ రమణ ఇంటి రేకుల షెడ్డు ఎగిరిపోయింది. ఇళ్లు కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తు సామగ్రి, 16 బస్తాల బియ్యం, దుస్తులు మొత్తం తడిసిపోయాయి. సుమారు రూ.ఒక లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
పుట్టపర్తి అర్బన్: గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోగా, జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి 8 గంటల నుంచి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. తీవ్రమైన గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు బెంబేలెత్తారు. తీవ్రమైన గాలులకు అక్కడక్కడా కరెంటు స్తంభాలు, పాత ఇళ్లు కూలాయి. పలు గ్రామాల్లో రేకులషెడ్లు కొట్టుకుపోయాయి. పలు వంకలు పొంగిపొర్లాయి.
అమరాపురంలో 49.2 మి.మీ వర్షం
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 32 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక కనగానపల్లి మండలంలో 32.6 మి.మీ, రొళ్ల 32.2, పెనుకొండ 30.2, తాడిమర్రి 29.2, కొత్తచెరువు 28.6, గాండ్లపెంట 28.4, రామగిరి 27.8, బత్తలపల్లి 27.4, తలుపుల 27.4, కదిరి 27, ఎన్పీ కుంట 25.4, అగళి 23.4, లేపాక్షి 20, నల్లమాడ 19.2, ధర్మవరం 18.6, మడకశిర 16.4, సీకేపల్లి 15.2, తనకల్లు 12.8, ముదిగుబ్బ 12.6, ఓడీచెరువు 12.4, నల్లచెరువు 12.2, రొద్దం 9.2, బుక్కపట్నం 7.2, గుడిబండ 7.2, పుట్టపర్తి 6.6, గోరంట్ల 6.4, సోమందేపల్లి 4.2, చిలమత్తూరు 4.2, హిందూపురం 3.6, పరిగి, అమడగూరు మండలాల్లో 2.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందన్నారు. శుక్రవారం కూడా రోజంతా ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. తాజా వర్షాలు ముంగారు సేద్యానికి మేలు చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం
580.8 మి.మీ వర్షపాతం నమోదు


