పరిగి: సహజవనరులను కాపాడాల్సిన పాలకులే అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడితే ప్రజల గోడు ఎవరు పట్టించుకుంటారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత తన అనుచరుల అక్రమాలకు అండగా నిలవడంతో పాటు అధికారులను సైతం కట్టడి చేయడం దారుణమన్నారు. మట్టిమాఫియాను నియంత్రించి.. చెరువుల్లోని సారవంతమైన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకునే అవకాశం కల్పించాలన్నారు. లేకపోతే రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని పరిగి పెద్ద చెరువు వద్ద రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. చెరువు పరిసర ప్రాంతాలైన ధనాపురం, వన్నంపల్లి సమీపంలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతులను పరిశీలించారు.
పొలాలకు తరలిస్తే అక్రమ కేసులా?
మంత్రి అనుచరులు రాత్రింబవళ్లు మట్టి తోలుకుంటున్నా అటువైపు చూడని ఇరిగేషన్ అధికారులు... చెరువు మట్టిని పొలాలకు తోలుకునే రైతులకు మాత్రం సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారని ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత అనుచరులే మట్టిమాఫియాగా ఏర్పడి నిత్యం వందలాది ట్రాక్టర్ల, టిప్పర్లతో మట్టిని తరలిస్తూ రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసి వాహనాలను పట్టుకున్నా...వెంటనే మంత్రి సవిత ఫోన్ చేసి వాటిని విడిచిపెట్టాలని ఆదేశిస్తున్నారని ఆరోపించారు. అధికారులు మంత్రి సవిత అనుచరుల ఆగడాలను అరికట్టకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చెరువుల్లోని మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వాలి
మంత్రి సవిత అనుచరుల మట్టిదందాను అరికట్టాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్


