కదిరి అర్బన్: అక్రమంగా ఇసుకు తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మంగళవారం సీఐ నారాయణరెడ్డి స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇసుక తరలింపులకు అనుమతులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
జీవాల మృతి
పెనుకొండ(సోమందేపల్లి): విద్యుత్ షాక్కు గురై గొర్రెలు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఉప్పర గోపాల్ వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలో గొర్రెల కోసమని షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం రాత్రి వీచిన పెనుగాలులకు తోడు స్వల్పంగా వర్షం కురవడంతో షెడ్డుకు విద్యుత్ ప్రసరించి 20 గొర్రెలు మృతువాత పడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన గోపాల్ వెంటనే విద్యుత్ సరఫరా ఆపి వేయడంతో మిగిలిన జీవాలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాయి. ఘటనతో రూ.1.60 లక్షల మేర నష్టం వాటిల్టినట్లు బాధిత కాపరి వాపోయాడు.


