ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 247 వినతులు అందాయి. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్, గడువు దాటినవి ఉండకూడదన్నారు.
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
ఎన్నికల సంఘం నిబంధలన మేరకు ఓటరు జాబితా పక్కాగా తయారు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రజా సంక్షేమం, పరిపాలన అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగనణ ప్రక్రియకు సంబంధించి కసరత్తు ప్రారంభమైందన్నారు. జిల్లాలో ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ, మ్యాపింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి భూ యజమానుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ల్యాండ్ సర్వే శాఖ ఏడీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.
పేదల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
పుట్టపర్తి టౌన్: నిరుపేద కుటుంబాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ప్రతి ఇంటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. పీ–4 కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం స్థానిక సాయి ఆరామంలో తొలి వార్షికోత్సవం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పీ–4 కార్యక్రమం ద్వారా పేదల అండగా నిలిచిన బంగారు కుటుంబాలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ సువర్ణ, సీపీఓ విజయకుమార్తోపాటు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో జిల్లా స్థాయి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ముత్తూ నాగమ్మ, వడ్డి యశోదలకు చెందిన నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3,084 గృహాలు, పుట్టపర్తి నియోజకవర్గంలో 1,144 నూతన గృహాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రవళ్లికతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం
‘పరిష్కార వేదిక’కు 247 అర్జీలు


