గాండ్లపెంట: వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రెండవ రోజు సోమవారం బండ్ల మెరవణి కార్యక్రమం వైభవంగా సాగింది. ఎద్దుల బండ్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ సోమవారం వేమన సమాధిని సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కరరెడ్డి, మండల వైస్ కన్వీనర్ వైవీ శంకర్నాయుడు, మలమీదపల్లి పంచాయతీ రాజ్ కార్యదర్శి చలపతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉల్ల తిరునాల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆర్టీఈ ఉచిత సీట్ల ఫలితాల విడుదల
పుట్టపర్తి: బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం కింద 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో 874 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరందరూ దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో ఏప్రిల్ 7వ తేదీ లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
సత్యసాయి వైద్య సంస్థకు వైద్య పరికరాల వితరణ
కడప సెవెన్రోడ్స్: పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్కు రూ.కోటి విలువైన 6 సెర్వో–సీ వెంటిలేటర్లు, 3 ఎఫ్ఎక్స్–8 సర్జికల్ యూనిట్లను ఎల్ఐసీ తరుఫున అందజేసినట్లు ఆ సంస్థ కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్వీ రవికుమార్ తెలిపారు. ఎల్ఐసీ శ్రీసత్యసాయి సంస్థల ముఖ్యుల సమక్షంలో సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్రాజ్కు ఈ పరికరాలను ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందజేశారన్నారు.


