సచివాలయ విధుల నుంచి మినహాయించండి
ప్రశాంతి నిలయం: సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్–3లకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనులు తప్ప ఇతర విధుల నుంచి మినహాయింపునివ్వాలని ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు లింగా రామమోహన్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనులతో పాటు దాదాపు 40 రకాల యాప్ల ద్వారా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఏఎన్ఎం గ్రేడ్–3లు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ఎన్సీడీ, అబా ఐడీ, లెప్రసీ స్క్రీనింగ్, ఆర్సీహెచ్, అన్మోల్, 104, ఆర్బీఎస్కే, ఇమ్యునైజేషన్, ఎన్డీడీ, డ్రై డే ఫ్రైడే వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఇవి కాక పెన్షన్ పంపిణీ, ఈకేవైసీ అప్డేట్, డోర్టు డోర్ సర్వే, యూనిటైడ్ హౌస్ హోల్డ్ సర్వే తదితర పనులకు కేటాయించడంతో ఒత్తిడి అధికమవుతోందని, దీంతో సచివాలయ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
మద్యం మత్తులో ఘర్షణ – ఒకరి మృతి
చిలమత్తూరు: మద్యం మత్తులో చోటు చేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన అన్నదమ్ములు వడ్డె తిరుపాలు, వడ్డె శంకరప్ప మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై చర్చించుకుంటూ కూర్చొన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్తులు కల్పించుకుని సర్ది చెప్పి ఇద్దరినీ ఇళ్లకు పంపించేశారు. కాసేపటికే తిరుపాలు (47) తన ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకలోని బాగేపల్లిలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మునీర్ అహమ్మద్.. ఘర్షణపై ఆరా తీసి, బాగేపల్లిలోని ఆస్పత్రికి చేరుకుని తిరుపాలు మృతదేహాన్ని పరిశీలించారు. ఎదపై చిన్నపాటి గాయాన్ని గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


