‘సూర్యఘర్’తో ఖర్చులు తగ్గించుకోండి
ప్రశాంతినిలయం: ప్రధాన మంత్రి సూర్య ఘర్ విద్యుత్ యోజనతో ప్రజలు విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. మంగళవారం కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ విద్యుత్ యోజన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. దీంతో విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు. కిలోవాట్కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణకుమార్, విద్యుత్శాఖ ఎస్ఈ మోసెస్, ఉద్యానశాఖాధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, విద్యుత్శాఖ డీఈ శివరాములు తదితరులు పాల్గొన్నారు.
17న జిల్లా స్థాయి
క్రీడా ఎంపికలు
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిశోర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయి శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 17న ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్ 13, 15, 17, 19 బాలుర, బాలికల విభాగంలో చదరంగం పోటీలు, 24న సైక్లింగ్లో అండర్–18 విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు తిరుపతిలో, 28 నుంచి మార్చి 1 వరకు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు విషయాన్ని గమనించాలన్నారు.


