నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవ చ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
పుట్టపర్తి: జిల్లావ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 1,489 మంది విద్యార్థులకు గాను 1,433 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,274 మందికి గాను 1,224 మంది హాజరయ్యారన్నారు. మొత్తంగా 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పరీక్షల పరిశీలకుడు రమేశ్ ధర్మవరం, హిందూపురంలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.


