గొర్రె పిల్లలపై చిరుత దాడి
తనకల్లు: మండల పరిధిలోని తురకవాండ్లపల్లి సమీపంలోని సింగరాతి చెరువు వద్ద గొర్రెల మందపై శుక్రవారం చిరుత పులి దాడి చేసింది. గొర్రెల కాపరి వెంకటరమణ వివరాల మేరకు.. తురకవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ తన గొర్రెలను సమీపంలోని అడవిలోకి మేత కోసం తీసుకెళ్లాడు. అయితే గొర్రెలకు నీటిని తాగించడానికి సమీపంలోని సింగరాతి చెరువు వద్దకు తీసుకెళ్లి కొద్దిదూరంలో కూర్చున్నాడు. హఠాత్తుగా చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. రెండు గొర్రె పిల్లల గొంతులను కొరకడం చూసిన వెంకటరమణ భయాందోళనకు గురయ్యాడు. తనపై చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడి వెంటనే చెరువులోకి దూకి అటు నుంచి దగ్గర్లోని గుట్టలోకి పెద్దగా కేకలు వేసుకుంటూ వెళ్లిపోయాడు. కేకలకు భయపడిన చిరుత రెండు గొర్రె పిల్లలను అక్కడే వదిలేసి సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లింది. సమాచారం అందుకున్న వెంకటరమణ కుమారుడు ముని, మరికొందరు గ్రామస్తులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వెంకటరమణతో పాటు గొర్రెలను ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై అటవీశాఖాధికారి గుర్రప్పను ‘సాక్షి’ వివరణ కోరగా గొర్రె పిల్లలపై చిరుత దాడి చేసినట్లు సమాచారం అందిందని, అటవీ సిబ్బంది పంపి విచారణ చేయిస్తామన్నారు.


