అబద్ధాలతో మోసం చేయడం, చెవిలో పూలు పెట్టడంలో ఆరితేరిన ము
● ‘రైతన్నా మీ కోసం’నుప్రచారానికి వాడుకున్న చంద్రబాబు సర్కార్
● నిలదీతల భయంతో రైతుల ఇళ్లకు వెళ్లని ప్రజాప్రతినిధులు
● రైతుకు సాయం చేయని సర్కార్..ఖర్చు మాత్రం రూ.కోట్లు
పుట్టపర్తి అర్బన్: వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులకు వివరించి సాగును లాభసాటిగా చేస్తామంటూ చంద్రబాబు సర్కార్ ’రైతన్నా.. మీకోసం’ పేరుతో ఆరు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాల్సి ఉన్నా..జిల్లా ఎక్కడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. వ్యవసాయ, మార్కెటింగ్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అందరూ కార్యాలయాలకే పరిమితమయ్యారు. ప్రచారానికి మాత్రం ప్రభుత్వ ధనం రూ.కోట్లు కుమ్మరించారు.
మమ అనిపించారు..
జిల్లాలో అట్టహాసంగా నవంబర్ 24న ‘రైతన్నా మీ కోసం’ ప్రారంభం కాగా, ఎమ్మెల్యేలు కేవలం ఆరోజు మాత్రం హడావుడి చేశారు. ఆ తర్వాత వారు ముఖం చాటేశారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వారు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన ఎమ్మెల్యేలు రైతుల ఇళ్లకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఒకరిద్దరు మాత్రం టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లి వాళ్లే రైతులన్నట్లు హడావుడి చేసి కార్యక్రమాన్ని మమ అనిపించారు.
రైతుల ఇళ్ల వద్దకు వెళ్లకుండానే...
జిల్లాలోని 2.59 లక్షల రైతు కుటుంబాలుండగా... వారందరినీ 5 రోజుల్లో కలవడం అసాధ్యమని భావించిన అధికారులు రోడ్లపై కనిపించిన వారితో పాటు ఆర్ఎస్కే దగ్గరకే వచ్చిన రైతులు, టీడీపీ కార్యకర్తలు, ఆపార్టీ సానుభూతిపరుల చేతిలో కరపత్రం పెట్టి ఫొటోలు దిగి వాటిని ఏపీ ఏఐఎంఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈ మేరకే రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కార్యక్రమాన్ని మమ అనిపించారు. 3వ తేదీన జిల్లాలోని 348 ఆర్ఎస్కేల్లో రైతులు, ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచి వర్క్షాప్ నిర్వహించాల్సి ఉండగా... రైతులు రారని తెలిసి కేవలం టీడీపీ సానుభూతిపరులను పిలిచి కార్యక్రమాన్ని ముగించారు. యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్తో పాటు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్లలో ఏయే పంటలు సాగు చేస్తారు, ఎరువులు ఎంత కావాలి, దిగుబడి, మార్కెట్ తదితర వివరాలను రైతులను అడిగి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టనట్టు ఆర్ఎస్కే సిబ్బంది వ్యవహరించారు.
అన్నీ కాకిలెక్కలు..
సాధారణంగా ఒక రైతు కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు రైతులుంటారు. అయితే వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో జిల్లాలోని 2,74,065 రైతు కుటుంబాల్లోని 10,38,924 మందిని కలిసినట్లు కాకి లెక్కలు చూపించారు. ఈ వివరాలను స్వయంగా జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ వెల్లడించారు. ఇందులో పురుష రైతులు 5,43,166 మంది, మహిళా రైతులు 4,95,758 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో లక్ష్యానికి మించి 6 శాతం అధికంగా ఇళ్లను సందర్శించినట్లు వెల్లడించారు. ఈలెక్కలు చూసి రైతులే ముక్కున వేలేసుకున్నారు.
అన్నదాతలకు అన్యాయం
అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రైతుల ఖాతాల్లో రూ. 20 వేలు జమ చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో (పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.4 వేలు కలిపి ) కేవలం రూ. 14 వేలు మాత్రం అందజేశారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. ఇవన్నీ పక్కనపెడితే ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందించలేకపోయారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం పనులు వదిలేసి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. కనీసం ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు కూడా సకాలంలో ఇవ్వలేదు.
అబద్ధాలతో మోసం చేయడం, చెవిలో పూలు పెట్టడంలో ఆరితేరిన ము


