
నాణ్యమైన వైద్య సేవలందించండి
హిందూపురం: రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. శనివారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రతి విభాగాన్నీ దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. రోగులకు తక్షణ, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిని తొలగించి.. కొత్తవారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవసరాన్ని బట్టి కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్ వద్ద కూడా డిస్ప్లే బోర్డులు, రోగులకు ఆస్పత్రిలో లభించే సదుపాయాల సమాచార బోర్డులు అందరికీ అర్థం అయ్యేలా ఉంచాలని చెప్పారు. బ్లడ్ బ్యాంక్లో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన అన్ని మందులూ ఉండేలా చూసుకోవాలన్నారు. ఓపీ కేంద్రాల వద్ద వీడియో డిస్ప్లే బోర్డులు, షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ పనులు సక్రమంగా పర్యవేక్షిస్తూ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ఓపీ చీటీల విభాగం ప్రారంభం
ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ చీటీల విభాగాన్ని కలెక్టర్ ప్రారంభించారు. హిందూపురం ఆస్పత్రిలో రోగుల రద్దీ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి ఆస్పత్రిలో అన్ని సదుపాయాలూ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, డాక్టర్లు, సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించి రోగులకు మెరుగైన సేవలందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, సూపరింటెండెంట్ సి.అన్నపూర్ణ, ఎన్టీఆర్ వైద్యసేవ అధికారి శ్రీదేవి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టేడియం పనులు వేగవంతం
హిందూపురంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో అసంపూర్తిగా ఉన్న ఇండోర్ షటిల్ స్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. త్వరలో ప్రత్యేక నిధులతో స్టేడియం పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు విద్యాసాగర్, బాలాజీ, అన్నపూర్ణ, శ్రీనివాస్ నాయుడు, శ్రీదేవి, ప్రభుకుమార్, మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
మందులు, రక్తం అందుబాటులో ఉంచండి
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ
సమావేశంలో కలెక్టర్ చేతన్