
‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం సొంతంగా నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్కు రెఫర్ అయిన యువకుడు ఆర్థో వార్డులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు దాదాపు ఆరు గంటలకు పైగా ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వివరాలు.. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, లక్ష్మీదేవి దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న రెండో కుమారుడు రాజేష్ (22) బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో తన ఎడమ కాలు నొప్పిగా ఉందంటూ 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 3న మేడా నర్సింగ్ హోంకు వెళ్లి డాక్టర్ ఆత్మారాంను సంప్రదించారు. ఆ రోజు అడ్మిషన్లో ఉంచుకున్న అనంతరం ఇక్కడైతే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని, జీజీహెచ్కు వెళితే అక్కడ ఉచితంగా వైద్యం చేస్తారని డాక్టర్ ఆత్మారాం తెలిపి, సిఫారసు చేయడంతో 4న ఆగమేఘాలపై జీజీహెచ్లోని ఆర్థో విభాగంలో వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీయించిన అనంతరం ఎడమ కాలులో చీము ఉన్నట్లు నిర్ధారించి, ఈ నెల 7న శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కానీ, సిబ్బంది కాని పట్టించుకోక పోవడంతో రెండు రోజుల పాటు నొప్పి తాళలేక రాజేష్ విలవిల్లాడినట్లు తల్లి లక్ష్మీదేవి కన్నీటి పర్యతమయ్యారు. నొప్పి వచ్చినప్పుడల్లా పీజీ వైద్యులు పరీక్షించి ఓ టాబ్లెట్, ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేవారని వివరించారు. బుధవారం ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో రాజేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయాన్ని వెంటనే డాక్టర్లకు తెలపడంతో వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారని వాపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు. మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం చేసి మృతుడి కుటుంబీకులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బు ఖర్చు పెట్టలేరనే
జీజీహెచ్కు వెళ్లమన్నా
కాలు నొప్పితో రాజేష్ మేడా నర్సింగ్ హోంకు వచ్చాడు. ఒక రోజు ట్రీట్మెంట్ ఇచ్చా. మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సి ఉందని, అందుకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పా. వారికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో నేనే జీజీహెచ్కు రెఫర్ చేసి, ఉచితంగా ఎంఆర్ఐ తీయించి, సర్జరీ చేశా. మృతికి సెప్టిసేమియా కారణమై ఉండవచ్చు. – డాక్టర్ ఆత్మారాం,
మెడికల్ సూపరింటెండెంట్, జీజీహెచ్
వివాదాస్పదంగా మారిన జీజీహెచ్
ఆర్థో వార్డులో యువకుడి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
6 గంటలకుపైగా కుటుంబీకుల ఆందోళన
దరిదాపులకు రాని సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం

‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్

‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్

‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్