
పేరుకే 40 శాతం సబ్సిడీ
ఖరీఫ్లో విత్తన వేరుశనగపై ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సబ్సిడీతో తమకు ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెబుతున్నా.. 10 శాతానికి మించి సబ్సిడీ అందే పరిస్థితి లేదని అంటున్నారు.
మడకశిర: ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తన పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్వింటాకు రూ.9,300 ధర నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ క్వింటా వేరుశనగ ధర రూ.9,300 లేదు. అయితే రాష్ట్రంలో మాత్రం వేరుశనగ విత్తనానికి అధిక ధరను నిర్ణయించి రైతులకు 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు గొప్పలకు పోతోంది. 40 శాతం సబ్సిడీ పోను రైతులు క్వింటా వేరుశనగ విత్తనానికి రూ.5,580 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.6,200 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వేరుశనగకు ఉన్న ధరతో పోల్చుకుంటే రైతులకు నామమాత్రంగానే సబ్సిడీ అందే పరిస్థితి కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లోని ధర ప్రకారం క్వింటాపై రైతులకు రూ.620 చొప్పున మాత్రమే సబ్సిడీ అందుతోంది. అయితే ప్రభుత్వ క్వింటాకు రూ.3,720 చొప్పున సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం.
బహిరంగ మార్కెట్లో కొనుగోలుకే మొగ్గు..
జిల్లాకు ఈ ఖరీఫ్ సీజన్లో 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్వేశించుకోగా... ధర గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు బహిరంగ మార్కెట్లో విత్తన వేరుశనగ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా వేరుశనగ విత్తనంపై అందించే సబ్సిడీ రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. సబ్సిడీ పోను ప్రభుత్వం అందించే ధరకే ఇంచుమించు బహిరంగ మార్కెట్లోనే నాణ్యమైన విత్తనం లభ్యమవుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది రైతులు రైతులు బహిరంగ మార్కెట్లోనే విత్తన కాయలను కొనుగోలు చేసి శుద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే విత్తనం కన్నా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనంలో 78 శాతం నాణ్యత ఉందని అంటున్నారు.
విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.9,300గా నిర్ణయించిన ప్రభుత్వం
40 శాతం సబ్సిడీతో
రైతుకు రూ.5,580కు
బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తనం క్వింటా రూ.6,200కే
ప్రభుత్వ నిర్ణయంపై
అన్నదాతల అసంతృప్తి