
అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు
పుట్టపర్తి టౌన్: ఏడాది క్రితం చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్పెరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ వెల్లడించారు. ధర్మవరంమండలం పోతుకుంట గ్రామానికి చెందిన మంజునాథకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన యమునతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకు తెరువు కోసం పెనుకొండలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో పెనుకొండకు చెందిన సిద్దప్పతో యమునతో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న మంజునాథ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మంజునాథ్ తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న యమున... ఆ మేరకు సిద్దప్పను ప్రభావితం చేసింది.
పథకం ప్రకారం హత్య..
యమునతో కలసి మంజునాథ్ హత్యకు కుట్ర పన్నిన సిద్ధప్ప 2024, ఏప్రెల్ 22న తన స్నేహితులు నూర్ మహమ్మద్, మదన్మోహన్, మోహన్తో ధర్మవరం మండలం నాగలూరు వద్ద ఉన్న పెద్ద వంకలో మద్యం పార్టీ ఏర్పాటు చేసుకుందామని మంజునాథ్ను పిలుచుకెళ్లాడు. అక్కడ మంజునాథ్కు అతిగా మద్యం తాగించి పథకం ప్రకారం టవాలును మెడకు బిగించి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ధర్మవరం రూరల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పసిగట్టారు. ఆదివారం సాయంత్రం పోతుకుంట గ్రామశివారులో తచ్చాడుతున్న ప్రధాన నిందితుడు సిద్దప్ప, నూర్ మహమ్మద్, మదన్మోహన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మోహన్, యమున పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన డీఎస్పీ హేమంత్కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు.
ఏడాది క్రితం వ్యక్తి హత్య కేసులో
వీడిన మిస్టరీ
ప్రియుడితో కలసి భర్తను
హత్య చేయించిన భార్య