పుట్టపర్తి అర్బన్:.....

పుట్టపర్తి అర్బన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తోందని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాయితీతో ఇవ్వడంతో పాటు పంటకు మద్దతు కల్పిస్తోందన్నారు. సేద్యాన్ని మరింత సులువు చేసేందుకు సబ్సిడీతో యంత్ర పరికరాలు అందజేస్తోందన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండులో నిర్వహించిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం మేళా–2 కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం కింద జిల్లాలో 234 సీహెచ్సీ గ్రూపులకు రూ.15.138 కోట్ల ఖర్చుతో 137 ట్రాక్టర్లు, 448 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామన్నారు. అంతేకాకుండా రైతులకు అందించే సబ్సిడీ మొత్తం రూ.5.4 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. ఇందుకు సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. రైతులంతా చిరుధాన్యాలు పండించి లాభాలను పొందాలని సూచించారు.
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం..
ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఆడిన మాట తప్పని శ్రీరాముని పాలనను సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తుంటే, ధ్రుతరాష్ట్రుని పాలనను చంద్రబాబు గుర్తు చేస్తున్నారని మండిపడ్డారు. పాలకుడు మంచివాడైతే ప్రకృతీ కరుణిస్తుందని, అందువల్లే జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, భూగర్భ జలాలు పెరిగి పాడిపంటలతో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం జగన్ రైతు సంక్షేమమే ధ్యేయంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ యంత్ర సేవ, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, సబ్సిడీ విత్తన కాయలు, ఎరువులు పంపిణీ, భూసార పరీక్షలు, ఆర్బీకేల ద్వారా క్రాప్ బుకింగ్, టార్పలిన్స్, స్ప్రేయర్లు, డ్రోన్లు, క్రాప్ ఇన్సూరెన్స్, పశు నష్ట పరిహారం, అమూల్ డెయిరీ ఏర్పాటు, సంచార పశు వైద్యశాల, పంట ఉత్పత్తుల నిలువకు గోడౌన్లు , 90 శాతం స్పింక్లర్లు, డ్రిప్ ఏర్పాటు, గిట్టుబాటు ధరతో పంటల కొనుగోలు తదితర సుమారు 20 రకాల సంక్షేమ పథకాలతో రైతులను రాజులను చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని పాలన సాగిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్ అవుటాల రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, అగ్రి బోర్టు మండల చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సోమందేపల్లి సొసైటీ అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఏడిఏలు సనావుల్లా, కృష్ణమీనన్, స్వయంప్రభ, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రైతులకు పంపిణీ చేసిన ట్రాక్టర్లు
వైఎస్సార్ యంత్రసేవతో
రైతులకు ఎంతో మేలు
ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ,
కలెక్టర్ అరుణ్బాబు
జిల్లా రైతులకు 137 ట్రాక్టర్లు,
448 పనిముట్లు
రైతులకు రూ.5.48 కోట్ల
చెక్కు అందజేత