● వ్యక్తి ఆత్మహత్య
కొడవలూరు: సెల్టవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొడవలూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విడవలూరు మండలం తుమ్మగుంటకు చెందిన ఇంద్రపల్లి కృష్ణ (45)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా అతని భార్యపిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా చేవూరులోని తన పుట్టింట్లో ఉంటోంది. కృష్ణ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. బేల్దారి పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసయ్యాడు. పనిచేయగా వచ్చిన డబ్బుతో ఫూటుగా మద్యం తాగి తిరిగేవాడు. ఈ క్రమంలోనే కృష్ణ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కొడవలూరులోని సెల్టవర్ ఎక్కుతుండగా టెక్నీషియన్ చూసి ఫొటో తీస్తూ టవర్ దిగాలని కేకలు వేశాడు. అప్పటికే బాగా ఎత్తులోకి చేరుకున్న కృష్ణ కిందకు దూకేశాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


