● ఇంటి వెనుక వ్యక్తి అనుమానాస్పద మృతి
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని పోలినాయుడు చెరువు గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పఠాన్ నాగూర్ (48) తన ఇంటి వెనుక పడి ఉండగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.


