● శిలాఫలకాన్ని టీడీపీ జెండా
దిమ్మెగా మార్చి..
● 3వ వార్డులో టీడీపీ నేతల
అత్యుత్సాహం
నెల్లూరు సిటీ: నగరంలోని మూడో డివిజన్ కిసాన్ నగర్లోని మధురా నగర్లో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారం భోత్సవం నిమిత్తం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు శిలాఫలకానికి పచ్చరంగు వేశారు. జెండా కట్టి ఎగురవేశారు. శిలాఫలకాన్ని జెండా దిమ్మెగా మార్చడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
కలిగిరి: మండలంలోని అనంతపురం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై కాకునూరు వెంకటేశ్వర్లు (60) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటేశ్వర్లు ట్రాక్టర్ పైకి ఎక్కి గడ్డి దించే క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లను గమనించలేదు. వాటికి తగిలి షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ప్రాణం తీసిన ఈత సరదా
దగదర్తి: సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చెన్నూరు ఎస్సీ కాలనీకి చెందిన వరకుమార్ కుమారుడు గుర్రం సంతోష్ (17) బుచ్చిరెడ్డిపాళెంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పరీక్షలు రాశాడు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి కావలి కాలువలో ఈతకు వెళ్లాడు. కాలువలో ఉన్న గుంతలో సంతోష్ ఇరుక్కుపోవడంతో భయపడిన స్నేహితులు గ్రామంలోకి వెళ్లి బంధువులకు తెలిపారు. వారొచ్చి సంతోష్ మృతిచెందినట్లు గుర్తించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘పది’ పరీక్షలకు
228 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా 228 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 28,002 మందికి గానూ 27,774 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 83 పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ తనిఖీ చేశారు.
● ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 202 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1,198 మందికి గానూ 996 మంది హాజరయ్యారు.


