● తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తుల మండిపాటు
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వంలో కామాంధులకు దేవస్థానాల చైర్మన్, కమిటీ మెంబర్ల పదవి ఇచ్చి ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని చిల్లకూరు మండలం తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తులు మండిపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన కోదండరామస్వామి ఆలయం చైర్మన్గా కోట సతీష్యాదవ్ను ఆరు నెలల క్రితమే నియమించారన్నారు. పదవి దక్కినప్పటి నుంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. మహిళలతో రాసలీలలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలు, గ్రామ ప్రజలు ఈ కమిటీని అసహ్యించుకుంటున్నారని, ఆలయ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి నీచులకు ఒక క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా దేవాలయాలు చైర్మన్లు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతుంటే ప్రజల్లో దైవచింతన ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వంటి వారిపై చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, ఎస్ సుబ్రహ్మణ్యం, బి సుబ్రహ్మణ్యం, ఏ వెంకటేశ్వర్లు, ఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు.


