ఇళ్ల మధ్య బార్ వద్దు
● కావలిలో ప్రజల నిరసన
కావలి: వ్యాపార సముదాయాలు, గృహల మధ్యలో బార్ వద్దంటూ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనను గురువారం చేపట్టారు. కావలి పట్టణంలోని లత థియేటర్ సమీపంలో ఉన్న షాపింగ్ క్లాంపెక్స్లో బార్ను గురువారం ప్రారంభించారు. దీంతో స్థానిక వ్యాపారులు, మహిళలు పెద్దఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అయ్యప్పస్వామి దేవస్థానం, కావలి గ్రామ దేవత కలుగోళమ్మ దేవస్థానం ఉందని, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. బార్ వెనుకవైపు వైద్యశాలతోపాటు కూతవేటు దూరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయన్నారు. గతంలో ఇక్కడ మద్యం దుకాణం ఉండటంతో స్థానికులను మందుబాబులు తీవ్ర ఇబ్బందులను గురిచేశారని ఆరోపించారు. బార్ను తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు.


