ఎనర్జీ అసిస్టెంట్లకు షాక్
ఉద్యోగోన్నతులు వెనక్కి.. వేతనాన్ని కోసి
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కటింగ్ ప్లయర్.. టెస్టర్ను పట్టుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాల్సిన జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపుతోంది. వార్డు వలంటీర్లు చేయాల్సిన ఇంటింటి సర్వేకు వీరిని వినియోగిస్తోంది. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
నాడు సజావుగా..
జిల్లాలో 570 మంది జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నియమించారు. వీరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పగలు, రాత్రనే తేడా లేకుండా విద్యుత్ సంబంధిత పనులు చేసేవారు. అధికారికంగా ఎలాంటి సెలవుల్లేకుండా విద్యుత్ సంస్థలో వీరు పనిచేస్తున్నారు. విద్యుత్ స్తంభాలెక్కడం.. లైన్ల పునరుద్ధరణ పనుల్లో ప్రమాదాలకు కొందరు గురికాగా, మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ తరుణంలో 2022లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వీరందర్నీ క్రమబద్ధీకరించి జీవితాల్లో వెలుగులు నింపారు.
సకాలంలో కాని పునరుద్ధరణ పనులు
సర్వేలకు వీరిని పురమాయించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయాల్లో పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బంది తప్పడంలేదు. వీరికి ఇతర పనులను అప్పజెప్పకుండా విద్యుత్ అవసరాల నిమిత్తం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీతంలో కోత.. పని రెట్టింపు
విద్యుత్ సైనికులను సర్వే కూలీలుగా మార్చిన వైనం
టెస్టర్, కటింగ్ ప్లయర్లను వదిలి ఇల్లిల్లూ తిరుగుతూ..
జేఎల్ఎం గ్రేడ్ – 2లకు
ప్రభుత్వమిచ్చిన గిఫ్ట్
గతేడాది డిసెంబర్లో వీరికి ఉద్యోగోన్నతులను కల్పించి.. వేతనాలను పెంచుతున్నామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే నెల గడవకముందే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. వేతనాల్లో కోత విధించింది. మరోవైపు జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధం లేని ఇంటింటి సర్వే పనులను ఈ నెల నుంచి అప్పగించారు. వారు విధులు నిర్వర్తించే ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసే పనులను అప్పజెప్పారు. ఓవైపు సర్వే.. మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయలేక వీరు సతమతమవుతున్నారు.


