ప్రజల దృష్టి మళ్లించేందుకు విషప్రచారం
● భక్తుల మనోభావాలతో
కూటమి చెలగాటం
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: ‘కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్ముతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు పాలనను గాలికొదిలేశారన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఒక్క భక్తుడైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేసి ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని, అందులో ఎలాంటి కొవ్వు పదార్థాల్లేవని స్పష్టం చేసినా అధికార పార్టీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చంద్రబాబు సర్కార్ అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని మేరిగ దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇబ్బంది పడిన నాయకుల కుటుంబాల పరామర్శకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరితే ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రభుత్వం ఓర్చుకోలేకపోయిందన్నారు. జగన్ పర్యటించే మార్గాలను మార్చి వేసి భద్రతా సిబ్బందికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తేట తెల్లమవుతోందన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భక్తుల మనోభావాలతో కూటమి నేతలు చెలగాటం ఆడుతున్నారన్నారు. సమావేశంలో గూడూరు రూరల్, కోట, చిట్టమూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు మల్లు విజయకుమార్రెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఊటుకూరు మహేంద్రరెడ్డి, గూడూరు పట్టణ, కోట మండల మహిళా విభాగం అధ్యక్షులు సుజనారెడ్డి, రేష్మ, నాయకులు రాజీవ్రామిరెడ్డి, సుధాకర్రెడ్డి, రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


