అత్తను చంపిన కేసులో అల్లుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇటీవల హత్యకు గురైన జయలక్ష్మి అనే మహిళ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నగర ఏఎస్పీ దీక్ష సోమవారం నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. అల్లీపురానికి చెందిన జయలక్ష్మి (39), జగన్ దంపతులకు కుమార్తె ఉంది. జయలక్ష్మి మేనల్లుడు టి.కుమార్ నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డులో నివాసముంటున్నాడు. అతని తల్లిదండ్రులు విభేదాలతో విడిపోవడంతో జయలక్ష్మి చేరదీసింది. తన ఇంట్లోనే పెట్టుకుని కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే అత్త, అల్లుడి నడుమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త జయలక్ష్మిని వదిలివెళ్లిపోయాడు. సుమారు నెలరోజుల క్రితం ఆమె తన కుమార్తె, అల్లుడితో ఆరెస్సార్ స్కూల్ ఎదురువీధిలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. కుమార్ను అతడి కుటుంబ సభ్యులను కలవనివ్వకపోగా, తల్లి మృతిచెందినా వెళ్లకుండా జయలక్ష్మి అడ్డుపడింది. ఈనెల ఆరో తేదీ కుమార్ తన పెద్దనాన్న ఇంటికి వెళ్లి వచ్చాడని జయలక్ష్మి గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను కత్తితో పొడిచి హత్యచేసి పరారయ్యాడు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.


