క్రెడిట్ చోరీకి తమ్ముళ్ల ఆరాటం
● వైఎస్సార్సీపీ హయాంలో బుచ్చిరెడ్డిపాళెంలో హెల్త్ సెంటర్ నిర్మాణం
● మేమే చేశామని చెప్పుకొనేందుకు టీడీపీ యత్నం
● రిబ్బన్ కట్ చేసేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెడీ
బుచ్చిరెడ్డిపాళెం: క్రెడిట్ చోరీ చేయడం తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి స్థానిక నేతల వరకు పరిపాటిగా మారింది. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయం.. ఇలా అనేక ప్రభుత్వ భవనాలే కనిపిస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, పునాది వేసి, నిర్మాణాలను పూర్తి చేసిన భవనాలకు ఇప్పుడు వాటికి రంగులేసి తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆరాట పడుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో సాగుతున్న ఈ క్రెడిట్ చోరీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగిందంటే..
అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని కట్టుబడిపాళెంలో సుమారు రూ.80 లక్షలతో పట్టణ ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా నిరంతరం పర్యవేక్షించి, గత ప్రభుత్వ హయాంలోనే భవన నిర్మాణాన్ని దాదాపు 99 శాతం పూర్తి చేయించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి.
ప్రచార ఆర్భాటం
సొంతంగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం చేతగాక, గత ప్రభుత్వం పూర్తి చేసిన భవనాలకు ‘కూటమి’ ముద్ర వేసే ప్రక్రియకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. కొన్ని రోజులుగా ఈ ఆరోగ్య కేంద్రానికి హడావుడిగా రంగులు వేయించి, చిన్న చిన్న పనులను చేసి, తమ ఘనతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, అదంతా తామే చేశామని చెప్పుకోవాలని చూస్తున్నారు. ఈ తంతు చూస్తున్న కట్టుబడిపాళెం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి నిధులు తెచ్చి బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు రంగులేసి మేమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?’ స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గమంతా ఇదే తీరు
కేవలం ఈ ఆరోగ్య కేంద్రమే కాదు. కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని కూటమి నేతలు, పూర్తయిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేయడానికి మాత్రం పోటీ పడుతున్నారు.
క్రెడిట్ చోరీకి తమ్ముళ్ల ఆరాటం


