కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజనులు
నెల్లూరు(దర్గామిట్ట): మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 10వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో గిరిజనులను పథకం ప్రకారం ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. దీనికి నగరపాలక సంస్థ మేయర్పై కుట్ర నిదర్శనమన్నారు. గిరిజన మహిళకు అన్యాయం జరిగితే జిల్లా పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అంబేడ్కర్, వివిధ సంఘాలకు చెందిన మాకాణి వెంకటేశ్వర్లు, బత్తెన లక్ష్మణశేఖర్, చెంచయ్య, గంధర్ల రమేష్, యాకసిరి మురళి, ఈగ శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు, బాపట్ల రామయ్య, చలంచర్ల శ్రీనివాసులు, చౌటూరు శ్రీనివాసులు, ఎందేటి సురేంద్ర, తలపల జైవర్ధన్, చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


