ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీపెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు స్మార్ట్మీటర్లను అమరుస్తున్నామని తెలిపారు. ప్రభు త్వ కార్యాలయాలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని వీధి దీపాలు, మంచినీటి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 16,802 స్మార్ట్ మీటర్లను అమర్చినట్లుగా తెలిపారు. వీటిని ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, వాటిని రీచార్జి చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను ఏర్పాటు చేశామని వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ మీటర్లతో విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.


