ఆత్మకూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామ ప్రజలు ప్రస్తుతం
కంపసముద్రం దళితకాలనీలోని ఓ వీధి
ఆత్మకూరు: మర్రిపాడు మండలంలోని కంపసముద్రం దళిత కాలనీ వాసులు భయం..భయం నడుమ జీవనం సాగిస్తున్నారు. ఫ్లోరిన్ కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో రెండు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడం వీరిని కలవరపాటుకు గురిచేస్తోంది. కిడ్నీ సంబంధిత సమస్యలు రెండేళ్ల నుంచి ఎక్కువవడంతో వైద్యం నిమిత్తం బద్వేలు, ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరు పరుగులు తీయాల్సి వస్తోంది. జల్జీవన్ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నా, స్థానిక యంత్రాంగం మాత్రం విఫలమవుతోంది.
40 శాతం మందికి..
ఈ కాలనీలో సుమారు 130 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆరేళ్ల మొదలుకొని 60 ఏళ్ల వయస్సు వారు కిడ్నీ వ్యాధిన బారిన పడ్డారంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 40 శాతం మందికి ఇది సోకడం గగుర్పాటుకు గురిచేస్తోంది. తాగునీటి సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విషయాన్ని మండలాధికారులు ఏడాది క్రితం గుర్తించారు. అయినా ఎలాంటి రక్షణ చర్యలను చేపట్టలేదు.
మంత్రి ఇలాకాలో ఇలా..!
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ దుస్థితి నెలకొన్నా, ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రాన్ని పలువురు కాలనీ వాసులు గతేడాది అందజేశారు. ఎట్టకేలకు గత నెలాఖరులో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎంహెచ్ఓ సుజాత, స్థానిక మండల వైద్యుల బృందం పర్యటించారు. పలువురి వద్ద రక్త నమూనాలను సేకరించారు. 13 ఏళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డారనే అంశాన్ని గుర్తించారు. అనంతరం కాలనీలోని బోర్లను పరిశీలించి నీటి శాంపిళ్లను సేకరించారు. ఎట్టకేలకు బోర్లలోని నీటితోనే కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తున్నాయని గుర్తించి.. తాగేందుకు ఉపయోగించరాదంటూ హెచ్చరికలు రాయించారు.
వైద్యానికే భారీగా..
వైద్యం చేయించుకునేందుకు భారీగా వెచ్చించి పలువురు అప్పులపాలయ్యారు. మర్రిపాడు మండలంలోని ఈ గ్రామం మారుమూల కావడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన సొంత నిధులతో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మాత్రమే ఉంది. ఇది గ్రామస్తులు, కాలనీ వాసులకు తాగునీటికి ఉపయోగపడుతోంది. కాలనీకి చెందిన సుమారు 40 మంది ప్రత్యేక వాహనంలో నెల్లూరులోని ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం శనివారం వెళ్లి మందులను తెచ్చుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాగునీటితో కిడ్నీ సమస్యలు
చిన్న వయస్సు వారికీ సంక్రమిస్తున్న వైనం
రెండు నెలల వ్యవధిలో ఐదుగురి మృతి
వైద్యం కోసం పరుగులు
మర్రిపాడు మండలంలో భయం.. భయం
ఆత్మకూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామ ప్రజలు ప్రస్తుతం


