మేయర్ స్థానానికి ఎన్నిక జరపాల్సిందే..
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. గిరిజన మేయర్ స్థానాన్ని వారికే అప్పగించాలని.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ ప్లకార్డును చేతబట్టి పోడియం వద్దకెళ్లి మాజీ మేయర్ స్రవంతి నిరసన చేపట్టారు. ఈమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కామాక్షిదేవి, వేనాటి శ్రీకాంత్రెడ్డి, మొయిళ్ల గౌరి, సత్తార్, నీలి రాఘవరావు, గుంజి జయలక్ష్మి, సాహిత్య సంఘీభావం తెలిపారు. దీంతో సమావేశం కొంత గందరగోళంగా మారింది. మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను ఇవ్వాల్సింది తాను కాదని, తాను కేవలం ఇన్చార్జి మేయర్ మాత్రమేనని రూప్కుమార్యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో సభను అర్ధగంట పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా, సభ్యులు ఇదే డిమాండ్ను లేవనెత్తడంతో, అజెండాలోని అంశాలన్నీ ఆల్ పాస్ అంటూ ఆమోదం తెలిపారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు వివిధ సమస్యలను లేవనెత్తారు. సమస్యలపై మాట్లాడేందుకు 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్రెడ్డి యత్నించగా, మీరు కూర్చోండి.. తర్వాత అవకాశమిస్తామని ఇన్చార్జి మేయర్ చెప్పారు. ఇలా అయితే ఇంట్లోనే ఉండేవాళ్లం.. ఇక్కడి వరకు ఎందుకొచ్చామంటూ ఆయన ప్రశ్నించారు.
ఇలా వ్యవహరించడమేమిటి..?
ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మేయర్ స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన గిరిజన మహిళకు కేటాయించారని, ప్రస్తుతం అలా కాకుండా వేరే వ్యక్తికి దీన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
స్రవంతి వినూత్న నిరసన
చర్చ లేకుండానే ఆల్ పాస్
నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశం


