రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయాలు
● భారీగా రేషన్ బియ్యం పట్టివేత
● అధికార పార్టీ నేతల అండదండలతో..
కావలి/ కావలి రూరల్: పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనాన్ని అధికారులు గుట్టురట్టు చేశారు. కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహా ట్రేడర్స్లో అధికారులు శనివారం దాడులు జరిపి భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంవత్సర కాలంగా లక్ష్మీనరసింహా ట్రేడర్స్ను కావలికి చెందిన సురే మదన్మోహన్రెడ్డి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అక్రమ రేషన్ బియ్యాన్ని తన మిల్లులో మెరుగుపట్టి అధిక రేట్లకు వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో సీఐ శ్రీహరి, కావలి రూరల్ పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీహరి మాట్లాడుతూ గత కొంత కాలంగా మద్దూరుపాడులోని లక్ష్మీనరసంహా ట్రేడర్స్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసి రీసైక్లింగ్ చేసి వేరే బస్తాలలోకి మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ దాడులు చేశామన్నారు. మిల్లులో సుమారు 400 బస్తాలకు పైగా అక్రమ రేషన్ బియ్యాన్ని దాచారన్నారు. ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, సహాయ సప్లయ్ అధికారి పుల్లయ్య, కావలి రూరల్ ఎస్సై బాజీబాబు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ విజయమ్మ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గుట్టుచప్పుడు కాకుండా..
ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణపట్నం పోర్టుతో పాటు చైన్నె వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. రేషన్ దందా చేస్తున్న మదన్మోహన్రెడ్డి అధికార పార్టీ ముసుగులో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయాలు


