పెద్ద పులి సంచారంతో కలకలం
● ఉదయగిరి దుర్గంపై పంజా
● వణుకుతున్న కొండ కింద గ్రామాల ప్రజలు
● 40 రోజులుగా కదలికలు
● తాజాగా కోనకాలువ వద్ద ఆవును
చంపినట్లు గుర్తింపు
ఉదయగిరి: ఉదయగిరి ఫారెస్ట్ పరిధిలోని దుర్గం ప్రాంతంలో పెద్దపులి సంచారంతో మరోసారి కలకలం రేగింది. ఈ క్రమంలో దుర్గం కింద ఉన్న 11 గ్రామాల వాసులు ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వ్యాఘ్రం 20 రోజులుగా ఈ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా దుర్గంపల్లి సమీపంలోని కోనకాలువ ప్రాంతంలో పెద్ద పులి పంజాకు ఓ ఆవు బలైందనే విషయాన్ని పశువుల కాపర్లు గురువారం గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కావలి సబ్ డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి, ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి కుమార్రాజా, మండల పశు వైద్యాధికారి రాఘవేంద్రశర్మతో పాటు పలువురు అటవీ అధికారుల బృందం ఘటన స్థలాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆవు కళేబరం కొంత మేర పాడైపోవడంతో శవపరీక్ష నిమిత్తం పలు నమూనాలను సేకరించారు. మరోవైపు ట్రాప్ కెమెరాలో పులి సంచారం నిక్షిప్తమై ఉన్నా, అధికారులు స్పందన నామమాత్రంగా ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి పంజా ద్వారా ఆవు మరణించిందాననే విషయం పోస్ట్మార్టం నివేదికలో తేలాల్సి ఉంది. అటవీ అధికారుల అనుమతి లేనిదే ఈ ప్రాంతానికి పర్యాటకులు రాకూడదు.
– శ్రీకాంత్రెడ్డి, సబ్ డివిజన్
అటవీ అధికారి, కావలి
పెద్ద పులి సంచారంతో కలకలం


