ఆగని నేరాలు
జ్యోతినగర్ టీచర్స్ కాలనీలో ఇంట్లో దొంగలు పడి 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు.
మర్రిపాడు మండలంలో ఎనిమిది ఆలయాల్లో సుమారు రూ.3 లక్షలు విలువచేసే సొత్తును చోరీ చేశారు.
పొదలకూరు మండలం విరువూరు జొన్నమిట్ట కాలనీకి చెందిన సుదర్శనమ్మ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు.
కోవూరు గొల్లవీధిలోని వరదరాజుల ఇంట్లో 59 సవర్లు బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి, రూ.3 లక్షల నగదును దొంగలు అపహరించారు.
జిల్లాలో నేరాలకు బ్రేక్ పడటం లేదు. బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇళ్లు, దేవాలయాలు అనే తేడా లేకుండా కొల్లగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు రూ.1.25 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును దుండగులు చోరీ చేశారు.
నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. తీరుమారని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నారు. ప్రజాజీవనానికి భంగం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ నిఘా, విజిబుల్ పోలీసింగ్, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. అయినా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. చంపుతామని బెదిరించి నగదు దోచుకుంటున్నారు. మత్తులో పోలీసులపైనా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఐదు హత్యలు చోటుచేసుకోగా హత్యాయత్నాలు పదుల సంఖ్యలో జరిగాయి. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి.
కొల్లగొడుతూ..
బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో దొంగల కళ్లు బంగారంపై పడ్డాయి. ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని పోలీసుల నిఘా కళ్లుగప్పిఒక్క రాత్రిలోనే కొల్లగొడుతున్నారు. దుకాణాలు, దేవాలయాలను వదలడం లేదు. ఆలయాల్లో అమ్మవార్లు, స్వామివార్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు హుండీలను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్తున్నారు. బైక్లపై రెక్కీ చేస్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని పుస్తుల తాడులను తెంపుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఉదాసీనత కారణం
కొందరి ఉదాసీనత దొంగలకు కలిసొస్తోంది. విలువైన వస్తువులు బీరువాల్లో పెట్టి బయటకు వెళ్లడం, తాళాలు అక్కడే పెట్టడం వంటివి చేస్తున్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని, లాకర్లలో భద్రపర్చుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం సేవలను వినియోగించుకోవాలని పోలీసులు చెబుతున్నా ప్రజల నుంచి స్పందన నామమాత్రంగానే ఉంది.
అప్రమత్తంగా ఉండాలి
వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదు. స్థానిక పోలీసులకు తెలియజేసి ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలి. ఇంటిని గమనిస్తుండాలని చుట్టుపక్కల వారికి చెప్పాలి. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
హడలెత్తిస్తున్న దొంగతనాలు
ఈ ఏడాదిలో
రూ.1.25 కోట్ల సొత్తు చోరీ
చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం
ఇటీవల
ఆగని నేరాలు


