రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివి
దాతల సహకారంతో ముందుకు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): కేన్సర్ బారినపడిన పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా చికిత్సలను అందిస్తున్న రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివని కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం, పొదలకూరు రోడ్డులో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కేన్సర్ ఆస్పత్రిని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఆస్పత్రి ఆవరణలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేన్సర్ను ముందుగానే గుర్తించేందుకు గానూ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. రెడ్క్రాస్ లాంటి సంస్థలు లాభాపేక్ష లేకుండా సేవా భావంతో వైద్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు.
పలువురి విరాళం
కేన్సర్ ఆస్పత్రికి నగరానికి చెందిన శ్రీహరిరెడ్డి రూ.1.1 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆస్పత్రిలో ఐదు నూతన గదుల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని రెడ్క్రాస్కు చెందిన రంగయ్యనాయుడు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, కోశాధికారి శ్రీహరిరావు, వైస్ చైర్మన్ జనార్దన్రాజు, కో శాధికారి సురేష్జైన్, ఎడవల్లి సురేష్, వెంకటేష్, రంగాచారి, కేన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆరు పడకలతో 2001లో ప్రారంభమైన కేన్సర్ ఆస్పత్రి.. ఇప్పుడు 150 పడకలతో ఆధునిక యంత్రాలతో అభివృద్ధి చెందేందుకు నిబద్ధత కలిగిన డాక్టర్ల సేవలతో పాటు దాతల కృషి కారణమని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. దాతల సహకారంతోనే మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన జేఎస్ చారిటబుల్.. భగవాన్ మహావీర్ ట్రస్ట్ల నిర్వాహకులతో పాటు సుమంత్రెడ్డి, దొడ్ల స్వాతి, డేవిట్ పీటర్, సీతారాములు తదితరులను కలెక్టర్ సత్కరించారు


