ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ దాడులు
● రూ.1.46 కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
మనుబోలు: మండల పరిధిలోని మనుబోలు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. జ్యాన్తి మల్టీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేశారు. బిల్లుల్లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రియల్ ఆయిల్ను దిగుమతి చేసుకుని, డీజిల్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సదరు సంస్థ చెల్లుబాటయ్యే లైసెన్స్లు, విక్రయ బిల్లులు, ఫాం ఎఫ్ తదితర అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. రూ.97.90 లక్షల విలువ చేసే 1.10 లక్షల లీటర్ల ఇండస్ట్రియల్ ఆయిల్, రూ.49 లక్షల విలువైన 5 ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరుకును మనుబోలు తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లోని సెక్షన్ 6–ఏ ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సంస్థ డైరెక్టర్లు చంద్రభాన్ సింగ్, మమతాసింగ్, స్థానిక ఆర్గనైజర్ నరేష్నాయుడిపై కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐఓపీ శ్రీహరి, ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ, పుల్లయ్య, పొదలకూరు సీఎస్డీటీ రవి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏఈఈ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎస్కే రియాజ్ పాల్గొన్నారు.


