కార్మికులతో డీఎస్పీ, అధికారుల చర్చలు
● నిరసన వాయిదా
కొడవలూరు: మండలంలోని రాచర్లపాడు వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల నిరసన మంగళవారం కూడా కొనసాగింది. తొలగించబడిన కార్మికులు ఉదయం 9 గంటలకు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసన ప్రారంభించారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, తహసీల్దార్ కె.స్ఫూర్తి రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసనకారులు, యాజమాన్యంతో చర్చించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో జూలై మాసంలో ఉత్పత్తి ప్రారంభమవుతున్నందున అప్పట్నుంచే విధుల్లోకి తీసుకుంటామని సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ తెలిపారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. నాలుగు రోజుల గడువిస్తే యాజమాన్యంతో మాట్లాడి స్పష్టత ఇస్తామని, అప్పటి వరకూ నిరసనలు ఆపాలని వేణుగోపాల్ కోరారు. అందుకు కార్మికులు కూడా అంగీకరించి నిరసనను ఉపసంహరించారు. కార్యక్రమంలో రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు పాల్గొన్నారు.


