కార్మికులను నిలిపివేయడంపై ఆగ్రహం
● వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట రేగడి చెలిక, రాచర్లపాడు గ్రామస్తుల నిరసన
● ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను
వెళ్లనీయకుండా అడ్డగింత
కొడవలూరు: మండలంలోని రాచర్లపాడులోని వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను నిలిపివేయడంపై రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గతంలో సీమెన్స్ గమేసాగా ఉన్న ఫ్యాక్టరీని నెల క్రితం వయోనా ఎనర్జీ సంస్థ తీసుకొంది. గమేసా సీమెన్స్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా ఉత్పత్తి నిలిపివేసినా అందులో పని చేస్తున్న 110 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. అయితే వయోనా ఫ్యాక్టరీ 75 మంది కార్మికులను నిలిపి వేసి కేవలం 35 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకుంది. దీంతో తొలగించబడిన కార్మికులు గ్రామస్తుల అండతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కార్మికుల అందర్ని విధుల్లోకి తీసుకునే దాకా నిరసనను కొనసాగిస్తామంటూ పట్టుబట్టారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున ప్రతినిధులు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ రెండు నెలల తరువాత పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, ఆ సమయంలో మిగిలిన వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామని బుజ్జగించారు. అయితే కార్మికులు సీమెన్స్ గమేసా రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయించకుండానే వేతనాలు చెల్లించిందని, వయో నా సంస్ధ నిర్ధాక్షిణ్యంగా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున మంగళవారం వారితో చర్చించి స్పష్టత ఇస్తామని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. స్థానిక నాయకులు దేవనబోయిన శివకుమార్, కసిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాగేంద్ర యాదవ్, చెముకుల హజరత్తయ్య, దువ్వూరు శీనయ్య, ఓబులేసు, సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


