విష సంస్కృతిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలు
ఆత్మకూరు: టీడీపీ కూటమి నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై భౌతిక దాడులకు దిగుతూ కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురిచేస్తూ విషసంస్కృతిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయకులతో పాటు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారన్నారు. జిల్లాలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంతో మొదలు పెట్టి మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్తో పాటు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించిన వారి నోళ్లు మూయించి కూటమి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని ఇప్పటి వరకు దుష్ప్రచారం చేసిన కూటమి నాయకులు సీబీఐ నివేదికతో తమ తప్పును గ్రహించారని, దీని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు దాడులు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి దాడులు చూసి రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక కూటమి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని అనుకునే పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్లిపోయారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


