సమస్యల పరిష్కారానికి ‘ప్రత్యేక వేదిక’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా సర్కిల్ పరిధిలో ఉన్న పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతినెలా మొదటి బుధవారం విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు ఈనెల 4వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య తమ సమస్యలను చెప్పొచ్చన్నారు.
వివాహిత ఆత్మహత్య
ఉదయగిరి: పట్టణంలోని ఈద్గామిట్టలో నివాసముంటున్న ఓ వివాహిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన అనిల్శర్మ కొంత కాలం క్రితం ఉదయగిరికి కాపురం వచ్చి శివాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అతనికి భార్య గాయత్రి (28), ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కుటుంబ కలహాలున్నట్లు తెలుస్తోంది. గాయత్రి సోమవారం మధ్యాహ్నం స్కూల్కు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి కొంతసేపు వారితో గడిపి ఇంటికొచ్చింది. అనిల్శర్మ గుడికి వెళ్లాడు. స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. వారు పక్కింట్లోని వారి ద్వారా అనిత్తో ఫోన్లో మాట్లాడారు. అతను ఇంటికొచ్చాడు. తలుపు లోపల గడి పెట్టి ఉంది. దీంతో గట్టిగా తలుపులను తన్నడంతో ఊడి వచ్చింది. భార్య ఫ్యాన్కు ఉరేసుకుని ఉంది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారొచ్చి ఆమెను తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్సై శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.


