వైఎస్సార్సీపీకి కార్యకర్తలే వెన్నెముక
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని.. కష్టకాలంలో ఉన్న వారికి భవిష్యత్తులో ప్రాధాన్యమివ్వనున్నామని.. పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మార్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారికి గ్రామ స్థాయి కమిటీల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పది వేల మంది గ్రామ కమిటీ సభ్యులను నియమించనున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేయనున్నారని ప్రకటించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపుందన్నారు. 2024లో నిర్వహించిన ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లు సాధించగా.. మూడు పార్టీలతో కూటమి 58 శాతానికి మించి సాధించలేకపోయిందని తెలిపారు.
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు అసత్య వ్యాఖ్య లు చేశారని, దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది భక్తులు మనోవేదనకు గురయ్యారని, వీరికి సమాధానం చెప్పాలన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాటలను వక్రీకరించి గందరగోళాన్ని సృష్టించి లడ్డూ ప్రసాదాల విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై దాడి అమానుషమని, టీడీపీ నేతల దాష్టీకాలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలను అందజేశారని, అయితే ఇప్పుడు సక్రమంగా అందడంలేదని ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో ఎమ్మెల్యేలుగా ఎందరో పనిచేశారని, అయితే సోమిరెడ్డి తరహాలో లే అవుట్ల యజమానుల వద్ద డబ్బులను ఎవరూ వసూలు చేయలేదని చెప్పారు. 2014 – 19, 2019 – 24 నుంచి నేటి వరకు ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణకు సిద్ధమానని సవాల్ విసిరారు. జిల్లాలో తమ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నికలెప్పుడొచ్చినా తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. సర్వేపల్లి బూత్ కమిటీ కన్వీనర్ బచ్చల సురేష్కుమార్రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, సర్పంచ్ చిట్టెమ్మ, లక్ష్మీ కల్యాణి, నేతలు అంజద్, రావుల ఇంద్రసేన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


