అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
● పాన్మసాలా, ఖైనీ,
ఫ్యాన్సీ వస్తువుల స్వాధీనం
● విలువ రూ.27.89 లక్షలు
నెల్లూరు (క్రైమ్): పాన్మసాలా, ఖైనీతోపాటు బిల్లుల్లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఫ్యాన్సీ వస్తువుల గోదాముపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. శని, ఆదివారాల్లో అధికారులు నెల్లూరు స్టౌన్హౌస్పేట సాలివీధిలోని శ్రీక్యామెల్ కాస్మోటిక్ షాపులో బిల్లుల్లేకుండా నిల్వ ఉంచిన రూ.55,920 విలువైన పాన్ మసాలాలు, రూ.11,27,520 విలువైన ఫ్యాన్సీ వస్తువులను, అదే ప్రాంతంలోని గీతా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్లో రూ.8,50,424 విలువైన ఫ్యాన్సీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సౌత్రాజుపాళెంలోని ఖదీర్ అనే వ్యక్తి గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.7,55,200 విలువైన 94,400 ఖైనీ సాచెట్స్ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాన్మసాలా, ఖైనీ, ఫ్యాన్సీ వస్తువుల మొత్తం విలువ రూ.27,89,064. బిల్లులు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తే భారీ ఎత్తున అపరాధ రుసుం వసూలు చేస్తామని విజిలెన్స్ డీసీటీఓ విష్ణురావు వ్యాపారులను హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాలరావు, ఏఓ శాంతి భూషణ్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
ఆత్మకూరు: బాలికను మోసం చేసిన కేసులో ఓ యువకుడిపై ఆత్మకూరు పోలీసులు అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ జి.గంగాధర్, ఎస్సై ఎస్కే జిలానీ ఆదివారం వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని ఉలవదిబ్బ ప్రాంతానికి చెందిన సంతోష్ ఓ బాలికకు కొన్నినెలలుగా మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయమై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ నిర్వహించారు. వివాహం చేసుకోవాలని కోరినా ఆ యువకుడు అడ్డం తిరగడంతో అట్రాసిటీ, పోక్సో కేసులు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం
మనుబోలు: మండల పరిధిలోని కొమ్మలపూడి – మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సిబ్బంది ఆదివారం గుర్తించారు. 147/23 – 25 కిలోమీటర్ వద్ద అప్లైన్లో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయి ఉండటాన్ని గుర్తించారు. కొద్దిరోజుల క్రితం రైల్లోంచి పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. గులాబీ, తెలుపు రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
కండలేరులో
58.960 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 450 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 300, హైలెవల్ కాలువకు 175, పిన్నేరు కాలువకు 250, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి: రూ.34 సన్నవి: రూ.20
పండ్లు: రూ.10
అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు


