తప్పు ఒప్పుకోవడానికి మొహమాటమెందుకు?
● చంద్రబాబును ప్రశ్నించిన కాకాణి
నెల్లూరు రూరల్: ‘చంద్రబాబూ చేసిన తప్పు ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకు?, ఏడుకొండలవాడా క్షమించు దేవుడా అనడగడానికి ఎందుకు సంకోచిస్తున్నావ్?, దేవదేవుడ్ని, తిరుమల ప్రసాదాన్ని బజారుకు ఈడ్చింది నువ్వుకాదా బాబూ’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో నానాయాగీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. వారు జంతువుల కొవ్వు ఉందని వ్యాఖ్యానిస్తే, ఆ మాటలు తప్పు అని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐల నివేదికలు చెప్పాయన్నారు. రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వారు ఆగలేదన్నారు. ల్యాబ్ రిపోర్ట్ తమకు అనుకూలంగా రాలేదని అనిల్ సింఘాల్ని బలిపశువును చేసి బదిలీ చేశారన్నారు. లడ్డూ విషయంలో ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తుంటే తప్పని చెప్పిన అంబటి రాంబాబుపై దాడి చేస్తారా, అక్రమ కేసులు పెడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా దాడులు చేయించడం సరికాదన్నారు. జంతు కొవ్వు కలవలేదని తెలిశాక టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేయించడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రాన్ని అ గ్నిగుండంగా మార్చడానికి చేసిన డైవర్షన్ పాలిటిక్స్, అనుచిత వ్యాఖ్యలను చూసి ప్రజలు చంద్రబాబును చీదరించుకుంటున్నారన్నారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు నిజం గెలిచింది, వాస్తవాలు బయటికి వచ్చాయని పూజలు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని భక్తులకు క్షమాపణ చెప్పి, చెంపలేసుకోవాలన్నారు.


