దివ్యాంగుల సంక్షేమానికి ‘కూటమి’ తూట్లు
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి తూట్లు పొడిచిందని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ.6 వేల పెన్షన్ కూడా టీడీపీ ఘనత కాదన్నారు. మందకృష్ణ మాదిగ పోరాటం చేసి టీడీపీ నేతల మెడలు వంచితేనే సాధ్యమైందన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కరువయ్యయన్నారు. అలాగే హాస్టళ్లలో సీసీ కెమెరాల్లేక విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాటికి నిధులు విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, దమ్ముంటే వాటిపై మాట్లాడాలని కోటేశ్వరరావుకు హితవు పలికారు. దివ్యాంగుల 21 రకాల వైకల్యాల ఉపకరణాల తయారీ కేంద్రాలు మూసివేసి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కోటేశ్వరరావు వైఎస్సార్సీపీ నేతలపై ఇస్టానుసారంగా మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు సుభాని పాల్గొన్నారు.


