లడ్డూలో కొవ్వు అబద్ధం
● బట్టబయలైన బాబు కుట్ర
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
● కసుమూరులోని వెంకటేశ్వరస్వామి
ఆలయంలో పూజలు
వెంకటాచలం (పొదలకూరు): శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వనేది అబద్ధమని.. చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు నిరాధారమని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైన తరుణంలో వెంకటాచలం మండలం కసుమూరులోని కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలను కాకాణి శనివారం నిర్వహించారు. చంద్రబాబుకు సద్బుద్ధిని ప్రసాదించాలని కాంక్షిస్తూ దేవస్థాన ప్రాంగణం వద్ద 101 టెంకాయలను కొట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యాన్ని టీటీడీ పొందిందని, దేవదేవుడు మన రాష్ట్రంలో కొలువుదీరడాన్ని అదృష్టంగా భావించాలని చెప్పారు. 2024, సెప్టెంబర్ 18న నిర్వహించిన సమావేశంలో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని చెప్పారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రసాదంలో పందికొవ్వు కలిసిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. దొంగ దీక్షలు చేపట్టి తిరుమల మెట్లను కడిగి హడావుడి చేశారని విమర్శించారు. నిజాలు నిర్ధారణ కాకముందే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని న్యాయస్థానం ప్రశ్నించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై నమ్మకం లేదని.. సీబీఐ అధికారులను ఈ దర్యాప్తులో భాగస్వాములను చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని, ఇతర కల్తీ జరగలేదని సీబీఐ నిర్ధారించి చార్జిషీట్ను దాఖలు చేసిందని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా, సనాతన ధర్మం పేరుతో పవన్కల్యాణ్ ఎన్ని కుయుక్తులు చేసినా జగన్మోహన్రెడ్డిపై వెంకటేశ్వరస్వామి ఆశీస్సులున్నాయని వివరించారు. సీబీఐ దర్యాప్తుతో భక్తుల్లో నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయని తెలిపారు. మందల వెంకటశేషయ్య, ఎంపీపీ కవిత, జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం, వైస్ ఎంపీపీ కోదండరామిరెడ్డి, పార్టీ కన్వీనర్ మోహన్నాయుడు, వేమారెడ్డి రఘునందన్రెడ్డి, కసుమూరు సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు.


