గురుకులాల్లో సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలోని తొమ్మిది బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 6, 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అంబేడ్కర్ గురుకులాల జిల్లా సమన్వయాధికారిణి డాక్టర్ సి.ప్రభావతమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని, ముత్తుకూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, కోడూరులలో ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని, కండలేరులో ఎంఈసీలో 40, సీఈసీలో 40 సీట్లు ఉన్నాయని, చిల్లకూరు, కోటలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. 6, 7, 8, 9, 10 తరగతుల్లో రిజర్వేషన్ అనుసరించి మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. https://apbragcet. apcfss.in వెబ్సైట్లో ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బైక్ను ఢీకొన్న కారు
● వ్యక్తి మృతి
మర్రిపాడు: బైక్ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన మర్రిపాడు మండల కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాపూరు మండలం అక్కంపేటకు చెందిన అంజిబాబు(29) అనే వ్యక్తి బైక్పై మర్రిపాడు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ రోడ్డుపై పడిపోగా, అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందారు. మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
● ప్రేమ వ్యవహారమే కారణమా?
కోవూరు: మండల పరిధిలోని కోనమ్మతోటకు చెందిన గరికపాటి నవీన్ (21) అనే యువకుడు తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏడాది కాలంగా నవీన్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా వారి మధ్య వ్యక్తిగత కారణాలతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్, శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సెల్ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గురుకులాల్లో సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం


