భక్తుల మనోభావాలతో కూటమి ఆటలు
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: ‘తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు భక్తుల మనోభావాలతో ఆటలాడారు. ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వారు సీబీఐ ఇచ్చిన నివేదికతో ఏమి చెబుతారు’ అని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రశ్నించారు. గూడూరులోని సనత్నగర్లో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల కన్వీనర్లు, పార్టీ అధ్యక్షులు, నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ తేల్చి చెప్పినా కూటమి నాయకులు కళ్లు తెరుచుకోలేదన్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కనీసం ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ నానాయాగీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీబీఐ ఇచ్చిన నివేదికపై నమ్మకం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ఉండేది కూడా కూటమిలోని ప్రభుత్వమే కాబట్టి, అక్కడికి వెళ్లి సీబీఐది తప్పుడు నివేదికని చెప్పండి చూద్దామంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెడ్డపేరు తీసుకురావాలని కూటమి ప్రయత్నిస్తే అది వికటించిందన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లు లెంపలు వేసుకుని ప్రజలకు, దేవదేవునికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. సమావేశంలో గూడూరు పట్టణ, కోట మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట, గూడూరు మహిళా విభాగాల అధ్యక్షులు రేష్మ, సృజనారెడ్డి, దీప్తి, సీనియర్ నాయకులు రాజీవ్రామిరెడ్డి, టౌన్ ఉపాధ్యక్షుఉల సుభాన్, ఇమ్రాన్, అన్నం మురళి తదితరులు పాల్గొన్నారు.


