మేయర్ దెబ్బకు.. టీడీపీ గంగవెర్రులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ స్రవంతిపై అవిశ్వాస ఘట్టం టీడీపీని కొద్ది రోజులుగా గంగవెర్రులెత్తించింది. ఊహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎంట్రీ.. సైకిల్ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. తాజాగా మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అధికార పార్టీ నేతలకు స్ట్రోక్ తగిలినట్లు అయింది. ఈ నెల 18న అవిశ్వాసానికి సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్ల సంఖ్యా బలం (కోరం)పై మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిలో వణుకు పుట్టించింది. ఈ క్రమంలో ఫిరాయింపు కార్పొరేటర్లతో మీటింగ్.. ఈటీంగ్ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. అందరికీ రూ.లక్షల్లో తాయితాలు, రూ.కోట్లల్లో కాంట్రాక్ట్ వర్కులిస్తామని హామీలిచ్చారు. అయినా ఆఖరి క్షణంలో చేజారిపోతారేమోననే ఆందోళనతో అందరితో ప్రమాణాలు చేయించారు. దీంతో అవిశ్వాసం నల్లేరుపై నడకేననే ధీమాతో ఉన్న మంత్రి, నెల్లూరు రూరల్కు కొందరు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. పచ్చ పార్టీలోకి ఫిరాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమ చేజారకుండా ఉండేందుకు అస్త్రశస్త్రాలు సంధించారు. అయినా అధికార పక్ష నేతలను భయం వెంటాడుతుండటంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వశక్తులొడ్డుతూ ఆపసోపాలు పడ్డారు. ప్రలోభాలతో పాటు రిసార్ట్స్కు తరలించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు.
అష్టదిగ్బంధం
టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలను తిప్పిగొట్టేందుకు మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పన్నిన పద్మవ్యూహంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు మైండ్ బ్లాకై ంది. టీడీపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో చేర్పించారు. ఈ హఠాత్పరిణామంతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలో గుబులు పట్టుకుంది. ఇంకెంత మంది చేజారిపోతారోననే ఆందోళన స్టార్టయింది. దీంతో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ చేతిలో 40 మంది కార్పొరేటర్లున్నా, అవిశ్వాసానికి ఇంకా నాలుగు రోజుల గడువున్న తరుణంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉన్న వారు తమ చేజారిపోకుండా ఉండేందుకు రిసార్టుల్లో ఉంచి.. గురువారం తీసుకొచ్చేలా పక్కా స్కెచ్తో కార్పొరేటర్లను అష్టదిగ్బంధం చేశారు.
గొంతెమ్మ కోర్కెలు తీర్చి..
టీడీపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లకు అవిశ్వాస తీర్మానం కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలతో పాటు పలు కాంట్రాక్ట్ పనులను ఇస్తామంటూ నిన్నామొన్నటి వరకు చెప్తూ వచ్చారు. అయితే వీరిలో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీన్ రివర్సయింది. ఇదే అదునుగా భావించిన కొందరు తమకు రూ.25 లక్షల కారు, రూ.40 లక్షల నగదును డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక వీరి గొంతెమ్మ కోర్కెలను తీర్చారు.
మేయర్ రాజీనామా ప్రకటనతో..
మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. అవిశ్వాసాన్ని నెగ్గేందుకు రూ.కోట్లు ఖర్చు చేశారు. రాజకీయ వ్యూహాలు, పోలీసులతో కిడ్నాప్ పన్నాగాలూ పన్నారు. అయితే చివరి క్షణంలో మేయర్ ప్రకటనతో ఇప్పటికే లబ్ధి పొందిన కార్పొరేటర్లు రాక్ కాగా, రూ.కోట్లు ఖర్చు పెట్టి ఆపసోపాలు పడిన టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు.
అవిశ్వాసానికి సర్వశక్తులొడ్డిన మంత్రులు ఆనం, నారాయణ
ఫిరాయింపుదారులకు భారీగా డబ్బు, కాంట్రాక్ట్లతో ప్రలోభాలు
తలొగ్గని వారిపై పోలీస్ కేసులతో
అస్త్రశస్త్రాలు
అయినా చేజారిపోతారనే భయంతో రిసార్ట్స్కు తరలింపు
ఆఖరి క్షణంలో స్రవంతి రాజీనామా ప్రకటన
కార్పొరేటర్లు రాక్.. మంత్రి, ఎమ్మెల్యే షాక్


