25న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ 7వ స్థాయీ సంఘాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతాయని తెలిపారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని కోరారు.
కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 35 శాతం సబ్సిడీ
నెల్లూరు (పొగతోట): రైతులు పండించిన ఆహార ఉత్పత్తులను అధిక రోజులు నిల్వ ఉంచుకునేందుకు సబ్సిడీపై రైపనింగ్ చాంబర్, కోల్డ్ రూమ్ నిర్మించుకునేందుకు సబ్సిడీల ప్రోత్సాహాకాలు అందించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎంవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండ్లు, కూరగాయలు, పూలను అధిక రోజులు నిల్వ ఉంచుకుని ధరలు పెరిగిన అనంతరం విక్రయించుకునేందుకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైపనింగ్ చాంబర్ ద్వారా ఆహార ఉత్పత్తులు తాజాగా ఉండడం వల్ల అధిక లాభాలు పొందవచ్చునన్నారు. మెట్రిక్ టన్ను రైపనింగ్ చాంబర్ నిర్మాణానికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందన్నారు. 35 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. రైతుకు గరిష్టంగా 70 మెట్రిక్ టన్నుల వరకు పరిమితి కలదన్నారు. కోల్డ్ రూమ్ నిర్మాణానికి ఖర్చు రూ.12.50 లక్షల అవుతుందన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు రాయితీ రూపేణా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు పూర్తి వివరాల కోసం జిల్లా ఉద్యాన అధికారి ఫోన్ నంబర్ 7995086780లో సంప్రదించాలని కోరారు.
‘గంగిశెట్టి’కి
బాలసాహిత్య అవార్డు
నెల్లూరు (బృందావనం): నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ త్రివేణి కళా సంగమంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డులను ప్రదానం చేసింది. తెలుగుభాషకు సంబంధించి నెల్లూరీయుడు గంగిశెట్టి శివకుమార్ రచించిన ‘కబుర్ల దేవత’ పిల్లల కథల సంపుటికి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్కు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ మాధవ్ కౌశిక్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు.
నేడు సాగుకు నీరు విడుదల
సోమశిల: ఐఏబీ నిర్ణయం మేరకు సోమశిల జలాశయం నుంచి శనివారం నుంచి జిల్లాలో సాగు చేసే పంటలకు నీరు విడుదల చేస్తున్నట్లు జలాశయ ఈఈ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఏబీ తీర్మానం మేరకు పెన్నాడెల్టాతోపాటు, ఉత్తర, దక్షిణ, డెల్టాకు అనుసంధానంగా ఉన్న కాలువలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తున్నామని, ఒక్కసారిగా నీటిని అధికంగా విడుదల చేస్తే వృథా అయ్యే అవకాశం ఉందన్నారు. జలాశయంలో 72.810 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ నీటిని పొదుపుగా వాడుకునే విధంగా దిగువకు విడుదల చేస్తామన్నారు. ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 560 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వివరించారు.


