
పేదల బియ్యం.. తమ్ముళ్ల వ్యాపారం
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు ధనదాహంతో బరితెగిస్తున్నారు. పేదల కడుపులు కొట్టి.. తమ బొక్కిసాలు నింపుకుంటున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వ సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నేతలే దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో మంత్రి ఆనం ఇలాకా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలంలో టీడీపీ నేతలు మాఫియాగా మారారు. ప్రధానంగా ఆ మండలంలోని వెంగంపల్లి అడ్డాగా అక్రమ రవాణా సాగిస్తున్నారు.
నెల మొదటి వారంలోనే ఖాళీ
అనంతసాగరం మండలంలో సుమారు 13,600 రేషన్ కార్డులు ఉండగా, సుమారు 340 టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. అయితే ఇందులో 90 శాతం బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. గత నెల మొదటి వారంలో ఈ మండలం నుంచి మినీ వాహనంలో కోవూరు సమీపంలోని ఓ రైస్మిల్లుకు తరలిస్తుండగా సుమారు 13 టన్నుల బియ్యం పట్టుబడిన విషయం విదితమే. తాజాగా ఈ నెల 3వ తేదీ 250 బస్తాలు 17.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడగా, శనివారం 80 బస్తాలు 6 టన్నుల బియ్యం పట్టుబడింది. దీన్నిబట్టి ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతోంది. ప్రతి నెలా 31వ తేదీకి ముందే రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. 1వ తేదీ నుంచి కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే కార్డుదారులకంటే ముందే రేషన్ మాఫియా అక్రమ మార్గంలో రైస్మిల్లులకు తరలించి పాలిష్ పట్టించి బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యంగా విక్రయిస్తున్నారు.
మంత్రి ఆనం ఇలాకాలోనే...
ప్రధానంగా మండలంలోని వెంగంపల్లి గ్రామాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మారింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులైన గ్రామానికి చెందిన టీడీపీ నేతలు బుట్టి మహేష్రెడ్డి (ప్రధాన సూత్రధారి)అనుసంధానంతో యనమల వంశీకృష్ణారెడ్డి, హజరత్రెడ్డి మాఫియా డాన్లుగా మారారు. పొలాల్లోని గోడౌన్లలో నిల్వ ఉంచి రాత్రి వేళల్లో అధికారులు పచ్చజెండా ఊపగానే నేరుగా నెల్లూరు, కావలి రైస్ మిల్లులకు తరలించి కిలో బియ్యాని రూ.35కు అమ్ముకుంటూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని వెంగంపల్లిలో కోడై కూస్తోంది.
వాహనాన్ని అడ్డుకున్న విలేకరులు
మండలంలోని నల్లరాజుపాళెం కాలువ గట్టుపై వెంగంపల్లికి చెందిన టీడీపీ నేతలకు చెందిన అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ మినీవ్యాన్ను శనివారం స్థానిక విలేకరులు అడ్డుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో సివిల్ సప్లయీస్, పోలీస్, రెవెన్యూ అధికారులు వాహనం వద్దకు వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా, 80 బస్తాల రేషన్ బియ్యం ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు.
మంత్రి ఆనం ఇలాకాలో రేషన్ బియ్యం మాఫియా
అక్రమ రవాణాకు అడ్డాగా వెంగంపల్లి
మాఫియా డాన్లుగా మహేష్ రెడ్డి,
వంశీకృష్ణ, హజరత్ రెడ్డి
80 బస్తాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న మీడియా
మామూళ్ల మత్తులో
సంబంధిత అధికారులు
మండలంలోని పలు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కిలో రూ.15 నగదు ఇచ్చి బియ్యాని కొనుగోలు చేసి మాఫియాకు కిలో రూ.20 వంతున అమ్ముకుంటూ అక్రమానికి పాల్పడుతున్నారని గ్రామాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మాఫియాకు సహకరించని డీలర్ల పరిధిలోని కార్డుదారుల వద్దకే మాఫియా మనుషులే నేరుగా వెళ్లి బియ్యాని కొనుగోలు చేస్తున్నారనేది జగద్వితమే.
రూ.15లకు కొని.. రూ.20 అమ్మి..